Thursday, April 19, 2012

నాన్న కోసం..

                   చీకటి పడింది. నాన్న ఇంకా ఇంటికి రాలేదు. నేను, అక్క అరుగు మీద కూర్చుని పెంకుల పైనుంచి జారిపడుతున్న నీటిచుక్కల్ని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాం. మూడు రోజుల నుంచి తెరిపిలేకుండా పడుతున్న వానకి నేలంతా తడిసి ముద్దయింది. ఇప్పుడే అలిసిపోయి కొంచెం అలసట తీర్చుకుంటున్నట్టుంది. ముసురు పడితే మూడ్రోజుల దాకా వదలదంట. నాన్న చెప్పాడు. అమ్మ కిరోసిన్ పోసి దీపం వెలిగిస్తోంది. దీపం వెలిగించగానే కొద్దిగా గుమ్మం వారగా వెలుగులోకి జరిగింది అక్క. అక్కకి చీకటంటే చెప్పలేనంత భయం. బయటికి చెప్పదు గానీ అమ్మకి కూడా చీకటంటే భయమే. నేను మగాణ్ణి కదా భయపడకూడదని నాన్న చెప్పాడు. భయపడ్డా పడినట్టు తెలియనివ్వకూడదని మావయ్య చెప్పాడు. కానీ ఇలాంటప్పుడు ఈ కరెంటోళ్లని తలచుకుంటే గొప్ప కోపం వస్తుంది. నాన్న అంటుంటాడు 'వర్షాకాలంలో మీ చదువులు, కరెంటోళ్ల వెలుగులు ఒకలాగే ఉంటాయిరా. ఎప్పుడు పోదామా అని చూస్తుంటారు' అని. నేను ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ చీకట్లోనే కూర్చుని, నాన్న కోసం చూస్తున్నాను.
                   ఇంతలో అమ్మ అన్నం కలిపి లోపలికి పిలిచింది.
                   "అప్పుడేనా? నాన్నొచ్చాక తింటాంలే" అంది అక్క.
                   "ఇంకెప్పుడే తల్లీ? మీ నాన్నొచ్చేటప్పటికి ఎంత అవుతుందో. వచ్చి తినండర్రా. మళ్లీ రేపు స్కూల్‌కెళ్లాలి." అని లాక్కెళ్లిపోయింది అమ్మ.
                  అయిష్టంగా కంచం ముందు కూర్చున్నా వీధి వైపే చూస్తున్నాం ఇద్దరం. ఇంతలో చీకట్లో లీలగా ఒక మనిషి కనిపించారు. అంతే.. గబుక్కున లేచి గుమ్మం దగ్గరికి పరిగెత్తాం. కొంచెం వెలుగులోకి రాగానే చిరునవ్వు నవ్వుతూ నాన్న కనిపించేసరికి అరుగుమీంచే ఎగిరి నాన్న మీదకి దూకేశా. నన్ను ఎత్తుకుని తమాయించుకునేలోపు అక్క కూడా నాన్నని గట్టిగా పట్టుకుంది. ఇద్దర్నీ ఎత్తుకుని లోపలి తీసుకొచ్చి, జేబులోంచి రెండు చాక్లెట్లు తీసిచ్చారు. మా ఇద్దరి కళ్ళల్లోనూ వెయ్యి దీపాల వెలుగు. అది చూసి నాన్న కళ్ళలో లక్ష దీపాల కాంతి.
                  "వీటి కోసమేనా బాబూ తిండి తినకుండా కూర్చున్నారూ? అయినా మీరు మరీనూ.. ఇప్పుడివన్నీ ఇస్తే ఇంక తిండేం తింటారు? చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి మీరు బాగానే మంచి చేసుకుంటారుగానీ తర్వాత నేను తిండి తినిపించలేక చావాలి" అంది అమ్మ.
                    నేను మనసులో అనుకున్నాను.. 'పిచ్చి అమ్మా! నాన్న తెచ్చేవాటి కోసం కాదు ఈ ఎదురుచూపు.. నాన్న కోసం'

                                                 *              *              *
 
              నాకు నాన్నంటే ఇష్టం. ఎంతంటే కొలతలు లేవు. కొన్నిటికి లెక్కలూ కొలతలూ ఉండవు మరి. ఎగరగలిగితే ఆకాశమంత. ఈదగలిగితే సముద్రమంత. చూడగలిగితే మనలోని నమ్మకమంత. అనుభవించగలిగితే నాన్నలోని ప్రేమంత. అంత ఇష్టం నాకు. అమ్మంత ఇష్టం. అమ్మ కన్నా కుంచెం ఎక్కువ ఇష్టం.
                     నాకు ఊహ తెలిశాక నాకు దొరికిన ఏకైక స్నేహితుడు నాన్న. తను ఏరోజూ మేమడిగింది కాదనలేదు. జేబులో డబ్బు లేకపోయినా, అప్పు చేసైనా ముందు మా సరదాలు తీర్చేవాడు. అనవసరమైన ఖర్చులు పెడుతున్నారని అమ్మ కోప్పడేది కానీ మేము ఎగిరి గంతేస్తుంటే అమ్మ కూడా సరదాపడేది. మాకు ఖరీదైనవన్నీ కొనిపెడుతూనే అమ్మానాన్నలు కొన్నిసార్లు పస్తులు పడుకునేవారు. మా వయసుకి అప్పుడు ఆ కష్టాలు అర్థం కాలేదు.
                      తెలివైనవాడినే..కాని చదువులో మాత్రం వెనకబడిపోయేవాడ్ని. టీచర్లు పిలిచి చెప్పేవారు మీ వాడికి అల్లరి తప్ప చదువు అబ్బేలా లేదండీ అని. అమ్మ బాధపడేది. కొడతారేమో అని నేను భయపడేవాడిని. కానీ నాన్న చిరునవ్వు నవ్వి ఊరుకునేవాడు. "నా కొడుకు మీద నాకు నమ్మకం ఉందోయ్. వీళ్ళు చెప్పేదేంటి వాడు చాలా గొప్పవాడవుతాడు చూడు" అనేవాడు. నాన్న నమ్మినట్టు నేను గొప్పవాణ్ణి కాలేదు కాని ఆయన నా మీద పెట్టిన నమ్మకం మాత్రం నా ఆత్మవిశ్వాసాన్ని నిలబెడుతూనే ఉంటుంది. నాకు మార్కులు బాగా వచ్చినప్పుడల్లా చెప్పుకుని పొంగిపోయేవాడు. బాగా రానప్పుడు 'పోన్లేరా.. మార్కులు ముఖ్యం కాదు. ఎంత నేర్చుకున్నావన్నది ముఖ్యం' అని ఊరుకునేవాడు. పరిస్థితులకు అనుగుణంగా మనుషులతో ఎలా ప్రవర్తించాలి అని నాన్న నేర్పిన మొదటి పాఠం అది.
               పదోతరగతి దాటి కాలేజ్‌లోకి అడుగుపెట్టాను. కాలేజ్‌కి వెళ్లే ముందు మొదటిరోజు నాన్న చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. "డబ్బు పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు, మనుషుల్ని పోగొట్టుకుంటే మరొకరు ఆ లోటుని భర్తీ చేయొచ్చు, బంధాలు తెగిపోతే తిరిగి కలుపుకోవచ్చు. కాని 'వ్యక్తిత్వం' కోల్పోతే తిరిగి సంపాదించలేం. సంపాదించినా దానికి విలువ ఉండదు. అదొక్కటి లేని నాడు మిగతావన్నీ ఉన్నా మనిషికి, జంతువుకి తేడా ఉండదు." 
                     ఆ విషయంలో మాత్రం నాన్నే నాకు ఆదర్శం. డబ్బు లేకపోయినా, తిండికి లేక పస్తులు పడుకున్నా, అడ్డదారులు తొక్కే అవకాశాలు దొరికినా ఏనాడూ తన వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టలేదు. తనలా నేను కూడా కష్టాలు పడకూడదని నిరంతరం జాగ్రత్త పడేవాడు. 'డబ్బు లేనిదే ఈ లోకంలో మనిషికి విలువ లేదు. బాగా సంపాదించు. నిజాయితీగా సంపాదించు. సంపాదించిన దాంట్లో నువ్వు తినగా మిగిలింది నలుగురికీ పెట్టు. కానీ అపాత్రదానం చెయ్యకు.' అని జాగ్రత్తలు చెప్పేవాడు.
                   ఇక చివరిగా తనకెంతో ఇష్టమైన వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్పాడు. 'డబ్బు లేకపోతే విలువ ఉండదు. కాని ఆ డబ్బు కోసం అడ్డదారులు తొక్కితే దానికి నిలకడ ఉండదు. గంజి తాగైనా బ్రతుకు. కాని మరొకడి కడుపు కొట్టో, ఒకడికి అన్యాయం చేసో మాత్రం పంచభక్ష్య పరమాన్నాలు తినాలనుకోకు. చివరిగా ఒకే మాట.. అప్పు చేయకు, తప్పు చేయకు'.
               నాకు నడక నేర్పింది మొదలు నడత నేర్పించేవరకు నా చేయి వదలలేదు నాన్న. నాలుగేళ్ళ వయసులో పుస్తకాలు చదివించాడు. ఎనిమిదేళ్ళ వయసులో ప్రపంచం చూపించాడు. పదేళ్ళకి నాతో రాజకీయాలు మాట్లాడాడు. పదమూడేళ్లకి సాహిత్య చర్చలు జరిపాడు. పదిహేనేళ్లకి వ్యక్తిత్వమంటే ఏంటో ఆచరణలో చూపించాడు. పదహారేళ్లకి చేయి వదిలేసి వెళ్లిపోయాడు. వెళ్లిపోతూ కూడా బ్రతికే ధైర్యం ఇచ్చి వెళ్లాడు. జీవితం అంటే కాలానికి ఎదురునిలవడం అని పాఠం నేర్పించి వెళ్లిపోయాడు. నాకు ఆస్తులు, అంతస్థులు ఇవ్వలేదు.. కాని వాటిని కాళ్ల దగ్గరికి రప్పించుకోగలననే నమ్మకాన్నిచ్చాడు. అవసరమైతే కాలదన్నగల విలువలు నేర్పించాడు. అందుకే నాన్నే నాకు మిత్రుడు, గురువు, మార్గనిర్దేశకుడు. నా జీవితంలో సాధించే ప్రతి విజయం, ఎక్కే ప్రతి మెట్టూ నాన్న కోసం..

Friday, March 9, 2012

పోరాట యోధుడికి గర్వంగా పలుకుతున్న వీడ్కోలు



నాకు అభిమానించడమే తెలుసు. దాన్ని ఎలా చాటుకోవాలో తెలీదు. 

కేవలం నీ కోసమే ఆటని ఆస్వాదించాను. చాలా సార్లు భరించాను కూడా. 

నువ్వు నిస్సహాయంగా వెళ్లిపోతున్నప్పుడు బాధపడ్డాను. 

నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు కోప్పడ్డాను.

నీ ఆటని ఎగతాళి చేసినప్పుడు చిన్నబుచ్చుకున్నాను. 

నువ్వు గెలిపించినప్పుడు గర్వపడ్డాను.

గెలిపించలేక తలదించుకున్నప్పుడు ఇంకా గర్వపడ్డాను.

చెక్కు చెదరని నీ ఆత్మవిశ్వాసం చూసి ముచ్చటపడ్డాను. 

నీ ప్రతీ అడుగునీ ఆనందించిన నాకు.. ఇప్పుడు మాత్రం మాటలు లేవు. 

సగం జీవితాన్ని సంపూర్ణంగా జీవించావు. శేష జీవితాన్ని సంతోషంగా జీవించాలని కోరుకుంటున్న..

--నీ అభిమాని.


(నాకు క్రికెట్‌లోని మజాని రుచి చూపించిన ద్రవిడ్‌కి ఒక పోస్ట్ అంకితం చేయడం చాలా చిన్న విషయం అని భావిస్తున్నాను.. నేను కూడా టెస్ట్ క్రికెట్ చూడడానికి రిటైర్మెంట్ ప్రకటించేస్తున్నాను.)




Monday, February 13, 2012

నా బాల్యానికి రెండో సగం అనగా సెకండ్ హాఫ్

ఇంటర్వెల్ అయిపోయింది. ఇక్కడ నుంచి సెకండ్ హాఫ్ మొదలవుతుందన్నమాట.

 అసలు ఫస్ట్ హాఫ్ చూడని వాళ్లు ఇక్కడ అని ఉన్న ఇక్కడ గట్టిగా ఓ నొక్కు నొక్కి చదివేసి రండి.

                                              *****************************

నాలో ఉన్న కళాకారుణ్ణి చూసి జడుసుకున్న మా నాన్నారికి అరనిమిషం పాటు భవిష్యద్‌వాణి హైదరాబాద్ కేంద్రం నుంచి సిగ్నల్ తగిలింది. నాకు రాబోయే పద్మభూషణ్ పురస్కారం, బుగాటీ కారు, ఖతార్ పౌరసత్వం ఇవేవీ వదులుకోకూడని నాన్నారు బలంగా ఫిక్స్ అయ్యారు. కళలను ప్రోత్సహించే ఇస్కూలు కోసం వెతుకుతుండగా ఒక మూడంతస్థుల భవనం బయట 'మీరు వెతుకుతున్న స్కూలు ఇదే' అని బోర్డ్ కనబడడంతో ఆగిపోయారు. ఆ కిందనే మరో బోర్డ్ మీద 'ఆషాఢమాసం డిస్కౌంట్ సేల్‌లో భాగంగా కళాకారులకు ఫీజులో రాయితీ' అని కూడా రాసి ఉంది. దాంతో చకచకా లోపలి పరుగులు తీసి, 'చదువుకి సంబంధించి చిన్న పరీక్ష పెడతాం. అందులో ఈది ఒడ్డునపడితేనే సీటు' అని రిసెప్షనిస్ట్ వారు బల్లగుద్ది మరీ చెప్పి, చేతికి దెబ్బ తగిలించుకోవడంతో నాన్నారు నీరసంగా బయటికి వచ్చారు. మన చదువు మీద ఎంత నమ్మకమో..!(సిగ్గు). మర్నాడు నాన్నారు నన్ను, మా అక్కను వెంటబెట్టుకు వెళ్ళారు. మా అక్క అడిగిన ప్రశ్నలన్నిటికీ టకటకామని సమాధానాలు రాసేయడం మొదలెట్టింది. ఇంతలో ఒక టీచర్ వచ్చి 'అలా అన్నిటికీ 'టకటకా' అని రాయకూడదు, తెలిస్తే కొన్ని ప్రశ్నలకి జవాబులు కూడా రాయాలి' అని చెప్పి వెళ్ళిపోయారు. నేను దీర్ఘంగా ఆలోచించి ప్రశ్నలు తిరగేసి రాసేసి, క్వశ్చన్ మార్కులు తీసేశాను. ఆ స్కూలు ప్రిన్సిపాల్ నా తెలివితేటలు మెచ్చుకుని, ఒక సీటు మీద రుమాలేసుకుని వచ్చెయ్యమని పంపించాడు. అవ్విధముగా ఆ స్కూలులో సీటు సంపాదించి కళారాధన సేయుటకు ఒక దారి దొరికిందని సంతసమున బల్లే బల్లే అని డ్యాన్సులు చేసితిని. కానీ క్రోకడైల్ ఫెస్టివల్ ముందు ఉందని తర్వాత అర్థమయింది.



మొదట్లో ఆ స్కూల్లో పిల్లకాయలందరూ నన్ను ఫ్లయింగ్ సాసర్‌లోంచి కిందకి దూకేసిన ఏలియన్ పిల్లలా చూసేవారు. నేను నోరు విప్పితే రామాయణం, మహాభారతం, జటాయువు, జాంబవంతుడు అనేవాడిని. టీచర్ రెండో ఎక్కం అడిగినా లంకాదహనం గురించి చెప్పేవాడిని. నాకు ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారకులు మా తాతాచార్యుల వారు. ఆయనకి ఏమీ ఊసుపోనప్పుడల్లా నన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని పురాణాలన్నీ కుండుకాయరసంలో కలిపి తలంటేవారు. అసలు నాకు మామూలు మాటలే సగం సగం అర్థమయ్యే రోజుల్లో దుష్యంతుడు, శకుంతల, అశ్వమేథం, పుత్రకామేష్ఠియాగాలంటూ లాటిన్ పదాలు చెప్పి భయపెట్టేవారు. ఈ జీవహింస నాకు రెండేళ్లున్నప్పుడే మొదలయ్యింది. అయినా ఆయన అలిసిపోయేదాకా కథ చెప్పేసి చివర్లో ఇచ్చే రూపాయి బిళ్ల కోసం ఓపిగ్గా భరించేవాడిని. కొన్నిసార్లు తప్పించుకుందామని పిచ్చిపిచ్చి ప్రశ్నలు అడిగితే ఆయనకి ఇంకా ఉత్సాహం పెరిగిపోయి ఇంకో రెండు పేజీలు ఎక్కువ చెప్పేవారు. అనుభవం పెరిగేకొద్దీ నోరు మూసుకు వినడం మొదలెట్టాను. నాకు ఎనిమిదేళ్ళు వచ్చేసరికి మా తాత రాముడితో అపాయింట్‌మెంట్ దొరికిందని వెళ్లిపోయారు. పన్నెండేళ్లు వచ్చేసరికి ఆయన లేని లోటు తెలిసొచ్చింది. ఇప్పుడు పురాణాల్లో ఏ సందేహాలు వచ్చినా గూగుల్ చేసుకోవాల్సి వస్తోంది. గూగుల్ పుట్టకముందే మా ఇంట్లో పెద్ద వికీపీడియా ఉండేదని తలచుకుని బాధపడతాను ఇప్పుడు. మీరందరూ నిట్టూర్చాల్సిన సన్నివేశం ఇది.



ఇక స్కూలు విషయానికి వస్తే అది తెలుగు, ఇంగ్లీష్ రెండు మాధ్యమాల్లోనూ ఉండేది. అతి తెలివి గల తల్లిదండ్రులు మాత్రమే వాళ్ళ పిల్లల్ని ఎక్కువ ఫీజ్ కట్టి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసేవారు. ఎందుకంటే తెలుగు మీడియం పాఠాలు తెలుగులో చెప్పేవారు, ఇంగ్లీష్ మీడియం పాఠాలు తెలుగులోకి అనువదించి చెప్పేవారు. అది కూడా స్వేచ్చానువాదం. మా అమ్మ తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న తెలివితేటలతో ఈ విషయం ముందే కనిపెట్టేసి, తెలుగు మీడియంలో పడేసింది. నాన్నారి మాతృభాషాభిమానం, మన సౌకర్యం కూడా తెలుగుకే ఓటేశాయి. మళ్ళీ స్కూలు విషయానికి వస్తే పెద్దగా బాధపెట్టేవారు కాదు..సింపుల్‌గా నరకం ఎంట్రన్స్‌గేట్ దాకా తీసుకెళ్లి వదిలేసేవారు. ప్రిన్సిపాల్‌కి బీపీ ఎక్కువ, పిల్లలకి అల్లరెక్కువ. మొత్తంగా మాకే వాచిపోయేది. మారువేషంలో ఉన్న ఇడీఅమీన్‌లా ఎప్పుడూ ఒక లాఠీ పట్టుకు తిరిగేవాడు. నాలుగడుగులకి తక్కువ ఎత్తున్నవాడెవడైనా బయట కనబడితే లాఠీకున్న నల్ల పెయింట్ వదిలిపోయేది. మా దరిద్రానికి తగ్గట్టు ఆదివారం వాళ్లావిడ ఊరెళ్లిపోయి, అదే రోజు మేము సినిమాకి వెళ్తే ఆ థియేటర్ దగ్గర కూడా కాపలా కాసి, కసి తీర్చేసుకునేవారు. మొదట్లో ఒళ్లు మండినా కొన్నాళ్లకి ఈ కోపం అంతా పిల్లకాయల మీద కాదని, గురు పత్నిగారు ఇంట్లో చేసే మర్యాద తట్టుకోలేక ఇలా ప్రవర్తిస్తుంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. దాంతో ఆయన బాధను అర్థం చేసుకుని, అప్పుడప్పుడూ ఆయనకి దొరికిపోతూ ఓదార్పుయాత్రలు చేసేవాళ్లం. ఇలా రోజుకి రెండు సార్లు గుర్తు చేసుకుని మరీ సర్ఫ్ఎక్సెల్‌తో ఉతికి, ఆరేసి, ఇస్త్రీ చేసి, మడతెట్టేస్తుంటే నా కళాహృదయానికి కాళ్లలో వణుకు మొదలైంది. ఒక రోజు చడీచప్పుడూ లేకుండా టికెట్ లేకుండా జనరల్ బోగీ ఎక్కేసి కాశీ పారిపోయింది.



థమన్‌బాబు ట్యూన్స్‌లా రోజూ ఒకే రాగంలో మా ప్రిన్సిపాల్ దరువేసినా ఆ స్కూల్‌ని భరించడానికి కారణాలు: మా శైలజా టీచర్, నా జీవితంలో మొదటి, ఆఖరి 'స్నేహితురాలు' గౌతమి(గర్ల్‌ఫ్రెండ్ అనుకుని అపార్థం చేసుకోకండి మళ్లీ), కిరికెట్టు. కిరికెట్టు సంగతి తర్వాత చెప్పుకుందాం. మా గౌతమికి, నాకు విపరీతమైన పోటీ అన్నిటిలోనూ. ఎంతంటే మా ఇద్దరికీ ఓసారి లెక్కల్లో వంద మార్కులొచ్చాయి(అలా నోరెళ్లబెట్టకూడదు..గ్రహాలు తిరగబడినప్పుడు ఇట్టాంటి అద్భుతాలు జరుగుతుంటాయి). వెంటనే శైలజా టీచర్ దగ్గరికి వెళ్లి 'నాకు ఇంకో అరమార్కు వెయ్యాలి, నేను చాయిస్‌లో వదిలెయ్యకుండా అన్నీ రాసేశాను. వాడితో సమానంగా మార్కులు రావడానికి నేనొప్పుకోను' అని సమర శంఖం పూరించింది. వెంటనే శైలజగారు పెద్ద మనసుతో అర్థం చేసుకుని, 100 కొట్టేసి 99 1/2 వేశారు. 'ఇప్పుడు వాడితో సమానంగా లేవుగా. వెళ్లు' అన్నారు. కికికి... అన్ని విషయాల్లోనూ అంత పోటీ పడ్డా ఎందుకో తనంటే నాకు ఇష్టం. ఆ తర్వాత మనం ఇంకో ఇస్కూలుని పావనం చేయాలని నిశ్చయించాక ఆ అమ్మాయిని కలవలేదు. ఇప్పుడు ఎక్కడుందో? సినిమాలో ఇది ఇంకో సెంటిమెంట్ సీన్ అన్నమాట.




ఇక సివరాకరది కిరికెట్టు. చదువులో ఎంత చండశాసనుడైనా మా ప్రిన్సిపాల్‌కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన చేతిలో దెబ్బలు తినకుండా తప్పించుకోవాలంటే క్రికెట్ ఒక్కటే మార్గం అని కనిపెట్టిన నేను ముందే వెళ్లి క్రికెట్ టీంలో ప్లేసు కోసం ఓ కర్చీఫ్ వేసేశాను. ప్రతీవారం పక్క స్కూళ్లతో బెట్ మ్యాచులు ఆడేవాళ్లం. సరిగ్గా ఓడిపోయే సమయానికి ఏదో ఒక కారణంతో గొడవ పెట్టేసేవాడిని. చిన్నప్పుడు తాగిన పాలన్నీ అరిగిపోయి, బక్కచిక్కి సోమాలియా కరవు బాధితుడిలా తయారయినా బలుపు తగ్గలేదు. గొడవలు పెట్టేసి ఎదుటివాడి మీదకి హనుమంతుడిలా ఎగిరేవాడిని. మొదటి దెబ్బ గట్టిగా కొట్టేవాడిని. రెండో దెబ్బ గట్టిగా తగిలేది. ముక్కు మీద మూడో దెబ్బ తగలకముందే మాసిపోయిన తెల్ల గుడ్డొకటి ఊపి సంధి చేసుకునేవాడిని. కొన్నాళ్లకి నాకు గొడవలు పెట్టడం తప్ప క్రికెట్ ఆడడం రాదన్న నిజం తెలుసుకుని నన్ను టీంలోంచి బయటకి తోసేశారు.



ఆస్ట్రేలియన్లను కూడా స్లెడ్జింగ్ చేసి భయపెట్టగల నా టాలెంట్‌ని గుర్తించకుండా బయటకి తోసేసిన వీళ్ల మీద పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యి, కరాటే క్లాసులకి వెళ్లాను. ఓ వారం రోజులు నా అత్యుత్సాహం చూసి ముచ్చటపడ్డ మా కరాటే గురువుగారు ఒక తెల్ల బెల్ట్ ఇచ్చి కట్టుకోమన్నారు. కళ్లలో రెండు లైట్లు వెలిగించుకుని 'ఇంక నాకు కరాటే వచ్చేసినట్టేనా?' అని అడిగాను. 'కాదు బాబు పాంట్ జారిపోకుండా ఇచ్చాను. బిగించి కట్టుకో. ఆ తెల్ల బెల్ట్‌ని పూర్తిగా మాపేసి నల్లగా మారిస్తే అప్పుడు నీకు కరాటే వచ్చినట్టు' అన్నాడు. నేను అదే పనిగా దాన్ని నల్లగా మార్చడం కోసం బురదలో దొర్లే పందిలా చిత్రవిచిత్ర విన్యాసాలు చేసేవాడిని. ఒకానొకనాడు అటువంటి ఒక విన్యాసం వికటించింది. న్యూటన్ గురుత్వాకర్షణ సూత్రం ప్రకారం గాల్లోకి ఎగిరిన నేను మళ్లీ భూమ్మీదకి తిరుగుప్రయాణం కట్టాను. కానీ విచిత్రంగా నా కాళ్లు నాకు కనబడలేదు. అవి ఇంకా గాల్లోనే ఉండిపోయాయేమో అని ఆలోచించేంతలో ముఖం సీఎం గారి హెలికాప్టర్‌లా సేఫ్‌గా నేల మీద లాండ్ అయింది. ఆ తర్వాత బ్యాండేజ్‌లకి బోల్డంత ఖర్చు కూడా అయింది. అదే రోజు మా తాతమ్మ అంటే మా అమ్మకి నానమ్మ సెంచరీ కొంచెంలో మిస్ అయింది. ఆ బాధలో మా అమ్మ నన్ను కరాటే మాన్పించేసింది. అలా అటు చదువుకి, ఇటు కళలకి, అటు కిరికెట్టుకి, ఇటు కరాటేకి, అటు పురాణాలకి, ఇటు శైలజా టీచర్‌కి చెందకుండా అయిపోయాను. ఆ తర్వాత ఏడాదికో స్కూల్ మారుతూ అన్ని స్కూళ్లలోనూ చెరగని ముద్రలు వేసేశాను. ఎన్నిసార్లు సున్నాలు వేయించినా ఆ ముద్రలు చెరగట్లేదుట పాపం. ఇంతకి మించి రాద్దామన్నా ఇంక బాల్యం లేదు. మీరు పర్వాలేదు అంటే కాలేజ్‌కి వచ్చిన తర్వాత కూడా కొనసాగిన నా బాల్యాన్ని వివరిస్తాను. :)

                                                ***  శుభం ***

Sunday, February 12, 2012

మాకూ ఉంది బాబూ బాల్యం..!

                                 ఎవడూ మనల్ని పొగడకపోతే మనల్ని మనమే పోగుడుకోవాలంట. మా పిన్ని చెప్పింది. అలాగే ఎవరూ మన జీవితచరిత్ర రాయనపుడు మనది మనమే రాసేసుకోవాలి. రచయిత పేరు మాత్రం గురజాడ అప్పారావనో, అల్లసాని పెద్దననో వేసుకోవాలి. 'అబ్బే.. మేము రాయలేదు, వీడి చెత్త చరిత్ర వీడే రాసేసుకున్నాడు చవట' అని వాళ్ళొచ్చి చెప్పలేరుగా. ఈ మధ్య రాజ్‌కుమార్ గారు తన చదువుని చాకిరేవు పెట్టారు. అది చదివి నవ్వి నవ్వి నవ్వలేక నీరసించిపోయాను. మళ్ళీ ఓ నాలుగు రోజుల్లో బలం కూడదీసుకునే సరికి గురువుగారు బులుసు వారు తమ జీవితచరిత్రకి శ్రీకారం చుట్టి, 'నా బాల్యం' అంటూ ఓ చిన్న టపా విసిరారు. అది చదివి కింద పడి దొర్లి నవ్వుతుంటే కింద ఫ్లాట్ వాళ్ళు కష్టపడి మెట్లెక్కి వచ్చి మరీ కొట్టబోయారు. (లింకులిచ్చాను కదా అని అటుపక్క వెళ్లి చదివెయ్యకండి. రాజుని చూసిన కళ్ళతో మొగుణ్ణి మూతి మీద గుద్దాలనిపించిదట. అర్థం చేసుకోవాలి మరి..!). 

                           ఈ బాల్యాలు మనపాలిట చాలా ప్రమాదకరంగా పరిణమించాయని గ్రహించడం జరిగింది. అప్పుడు కింద నుంచి ఒక ఎర్రలైటు వెలిగింది. నాలో ఉన్న విలన్ నిద్రలేచి పల్లు తోముకున్నాడు. 'ఏం నీకు లేదా బాల్యం? నీ చిన్న నాటి అడ్వెంచర్స్ చెపుతుంటే పెళ్ళిళ్ళలోనూ, ఫంక్షన్‌లలోనూ ఎంత మంది ఆస్పత్రి పాలవ్వలేదు? రాబిన్‌హుడ్ లాంటి నీ చైల్డ్‌హుడ్ స్టోరీస్ విని ఇంటికొచ్చిన చుట్టాలు బ్యాగ్‌లొదిలేసి మరీ పారిపోయిన రోజులు మర్చిపోయావా? ఇదే సరైన సమయం. నువ్వు కూడా ఓ టపా వదులు' అని నన్ను రెచ్చగొట్టి, ఎర్రలైటు ఆపేసుకుని మళ్ళీ నిద్రపోయాడు. 



యెస్.. ప్రతీకారానికి ఇదే సరైన సమయం. కాచుకోండి బ్లాగ్‌లోక వాసులార..!

                                                  ************************

అనగనగనగా ఒక రోజు. ఆ రోజు నేను పుట్టాను. పుట్టినప్పుడు నేను చాలా చిన్నవాణ్ణి. అందుకే ఎప్పుడు, ఎక్కడ పుట్టానో నాకు గుర్తులేదు. మా అమ్మ చెప్పింది నమ్మడమే. నేను ఆదివారం అర్థరాత్రి అనగా దెయ్యాలు వీకెండ్ పార్టీ చేసుకునే టైమ్‌లో పుట్టానట. నా అదృష్టం కొద్దీ ఆ రోజు అమావాస్య కాదు, ఏకాదశి. నేను పుట్టినప్పుడు ప్రకృతి జస్టిన్‌బీబర్‌లా ఒంటి మీద తెలివిలేనట్టు డాన్స్ చేసిందట. వర్షాలు, వరదలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు, నా ఏడుపులు. ఇంత భయంకరమైన బ్యాగ్రౌండ్ స్కోర్ మధ్య పుట్టిన నేను అంతే భయంకరంగా పెజానీకాన్ని భయపెట్టడం మొదలెట్టాను. నేను నాలుగేళ్లు వచ్చేదాకా పీపాలకి పీపాలు పాలు తాగేశానంట. కంగారూ సంచిలో దాని పిల్ల ఉన్నట్టు నిద్రపోయేటప్పుడు తప్ప మిగతా అన్ని వేళల్లోనూ పాలసీసా నా నోట్లో ఉండాల్సిందే. రోజూ ఒక ట్యాంకర్‌తో మా ఇంట్లో పాలు పోసేసి, కొన్నాళ్లకి 'స్టాక్ ఔట్' అని వేలెత్తేశారు విశాఖ పాల డెయిరీ వారు. ఇన్ని పాలు నాపాలు అయిపోవడం వల్ల నన్ను ఎత్తుకోవడానికి వెయిట్‌లిఫ్టర్‌లని బ్రతిమాలుకోవాల్సి వచ్చేదట. ఎవరినైనా ఎత్తుకోమంటే పోపు మాడిపోతోంది, ఇప్పుడే వస్తానని వెళ్లిపోయేవారు. నాకర్థం కానిదేంటంటే వాళ్ల ఇళ్లల్లో ఇరవైనాలుగ్గంటలూ పోపు తప్ప పొయ్యి మీద ఇంకేమీ ఉండదా అని..!??



కొన్నాళ్ళకి నాకు ఐదో పుట్టినరోజు వచ్చింది. అది ఒంటరిగా రాకుండా కొత్తబట్టలు, చాక్లెట్‌లు తెచ్చి తీసుకెళ్లి మా ఊరి ఎలిమెంటరీ స్కూల్లో కూర్చోబెట్టింది. నేను ఏ క్లాసో నాకు, మా అమ్మకి, ఆ స్కూల్ హెడ్‌మాస్టర్‌కి ఎవరికీ తెలీదు. ఆ స్కూల్‌ని అందరూ దుంపలబడి అనేవారు. అంటే ఏంటో నాకిప్పటికీ తెలీదు. ఆ స్కూల్లో ఇద్దరే మేష్టార్లు. ఒకరు హెడ్‌మేష్టారు, ఇంకొకరు హెడ్ లేని మేష్టారు. ఇద్దరూ చాలా పద్ధతిగా స్కూల్‌కి అరగంట ముందే వచ్చేవారు. పదింటికి గంటకొట్టించి, లైన్‌లో నిలబెట్టి ప్రార్థన చేయించేవారు. నాకు ఆ ప్రార్థన రాకపోయినా జేబులోంచి చేగోడీలు తీసి, నోట్లో వేసుకుని కరకరా నమిలేసేవాడిని. శృతిలో కలిసిపోయేది. ప్రార్థన అయిపోగానే అన్నిక్లాసుల వాళ్లు ఒకేరూములో కూర్చునేవాళ్లం. మేష్టారు వచ్చి ఒకడిని నిలబెట్టి, ఆయన పడుకునేవారు. హెడ్‌మేష్టారు కొంచెం పెద్దాయన కాబట్టి ఫ్యాన్ ఉన్న గదిలో నిద్రపోయేవారు. వెంటనే మేమంతా గ్రౌండ్‌లోకి పారిపోయి గోళీలు, కొబ్బరిమట్టతో కిరికెట్టు ఆడుకునేవాళ్లం. అమ్మాయిలంతా ఆ వయసులోనే మా పట్ల వివక్ష చూపించి, వేరే పక్కకెళ్లి అర్థం కాని అరేబియా ఆటలేవో ఆడుకునేవారు. పన్నెండవ్వగానే ఎవడో గంటకొట్టినట్టు మేష్టారులిద్దరికీ తెలివి వచ్చేసేది. వెంటనే స్కూలుకి తాళాలు వేసేసి, పన్నెండూ పదికి బస్సెక్కేసేవారు. మేము అంతకి పది నిమిషాల ముందే ఇంటికి పారిపోయేవాళ్లం.



ఆ ఏడాది గడిచే సరికి మన చదువు మహత్తరంగా సాగుతోందని అర్థం చేసుకున్న నాన్నారు 'నీ స్థాయికి ఈ స్కూలు సరిపోదు బాబూ' అని పట్టుకెళ్లి ఒక ప్రైవేట్ స్కూల్ వారికి అప్పగించేశారు. ఏ స్కూల్ అయితే ఏమున్నది గర్వకారణం.. మన చదువు సమస్తం గురుపీడన పరాయణత్వం అని నేను యధావిధిగా విజృంభించడం మొదలెట్టాను. నేను చదవకపోగా హిట్లర్ జర్మన్‌లను రెచ్చగొట్టినట్టు నేను మరో పదిమంది పిల్లకాయల్ని రెచ్చగొట్టి నా ముఠాలో చేర్చుకున్నాను. మొదటి పీరియడ్‌లో అటెండెన్స్ వేసి లెక్కల మేష్టారు వెళ్లిపోగానే, మేము ఇంకో పక్క నుంచి గోడ దూకి మామిడితోటలోకి పారిపోయేవాళ్లం. మళ్లీ మధ్యాహ్నం క్యారేజ్ మొత్తం ఖాళీ చేసేసి, తోముకోమని పక్క క్లాసులో ఉండే మా అక్క మొహాన పడేసేవాడిని. 'తోముతానురా.. ఇంటికి రా, నిన్ను కూడా తోముతాను' అని కళ్లతోనే మూగగా ఓ డైలాగు చెప్పేసి వెళ్లిపోయేది. ఆ ఇన్నర్‌వాయిస్ నాకు వినబడి భయమేసినా కనబడకుండా కవర్ చేసేవాడిని. తిన్న తర్వాత మళ్లీ గోడ దూకడం కష్టమనే ఐన్‌స్టీన్ కుఢ్యసాపేక్ష్య సిద్ధాంతం బాగా ఔపోసన పట్టడం చేత ఆ ఆలోచన విరమించుకునేవాళ్లం. మూలనున్న గోడకి జారబడి నిద్రపోవడానికి బాగుంటుందని మళ్లీ క్లాసురూముకి వెళ్లి కూర్చునేవాళ్లం. సాయంత్రం గంట కొట్టడానికి సరిగ్గా ఒక్క నిమిషం ముందు దేవతలు వచ్చి నిద్రలేపేవారు. ఆ నిమిషంలో ఒళ్లో ఉన్న పుస్తకాలు తీసి, సంచిలో సర్దేసి పారిపోయేవాళ్లం.



ఇలా సుఖంగా రోజులు గడిచిపోతూ, చదువులో అద్వితీయమైన ప్రతిభను చూపెడుతూ దూసుకుపోతున్న రోజుల్లో ఒక సంఘటన జరిగింది. ఒకానొక దివ్యమైన ముహూర్తంలో నాలో ఉన్న కళాకారుడు నిద్రలేచాడు. ఆ కళాకారుడికి అడగ్గానే చప్పట్లు కొట్టే మరొక కళాహృదయం తోడయితే బాగుంటుందని పక్కకి తిరిగి చూశాను. పక్కనున్నవాడు  గండుపిల్లిని చూసిన వానపాములా మొహం పెట్టాడు. అయినా సరే క్షమించే ఉద్దేశ్యం లేని నేను వాడిని లాక్కెళ్లి, స్కూల్ వెనక ఉన్న చెరువులో బంకమన్ను తెమ్మని ఆదేశించాను. వెంటనే అమరశిల్పి జక్కన్న నాలో ఆవహించాడు. ఆ మన్నుతో ఫోనులు, టీవీలు, మిక్సీలు, మంచాలు, దుప్పట్లు ఇలా నాకు తెలిసిన షేపులన్నీ చేసేశాను. నేను ఏది చేసినా మావాడు చప్పట్లు కొట్టేవాడు. ఆఖరికి దురదేసి బురద చేతులతో బుర్ర గోక్కున్నా చప్పట్లు కొట్టేవాడు. మర్నాడు క్లాసులోనే అందరిని విస్మయపరుద్దామని ఈ శిల్పరాజాలన్నిటినీ బయటికి తీసి నగిషీలు దిద్దడం మొదలెట్టాను. పిల్లకాయలందరూ నావైపు ఆశ్చర్యంగా చూస్తూ, ముక్కున వేలేసుకోవడం మొదలెట్టారు. ఇదేదో బావుందే అని నేను ఇంకా చెలరేగి చెక్కుతుండగా, నెత్తి మీద పిడుగు పడింది. సౌండ్ తక్కువ వచ్చిందే, ఇది పిడుగు అయ్యుండదని నిర్థారించుకుని వెనక్కి తిరిగేసరికి తెలిసింది.. అది పిడుగు కాదు సారువాడి పిడికిలి అని. 



నాలుక మీద నల్లజీడి అంటించుకున్న హిట్లర్‌లా మొహం పెట్టి ఏవిటిది అని కళ్లతోనే ప్రశ్నించారు. శిల, కళ, కళ కళ అని కళ్లతోనే జవాబిచ్చాను. ఆయన ప్రత్త్యుత్తరం కోసం నేను కళ్లవైపు చూస్తుండగా ఆయన కాళ్లతో సమాధానం చెప్పారు. మధ్యాహ్నం తిన్న మామిడికాయ పప్పు బలమంతా కాళ్లలోకి తెచ్చుకుని ఒక్క తొక్కు తొక్కారు. అంతే.. నా కళ ఛిద్రమైపోయింది. మనసు ముక్కలైపోయింది. చెంప వాచిపోయింది. బలవంతులతో తొందరపడి యుద్ధానికి దిగకూడదనే చాణక్యుడి నీతి సూత్రాన్ని అనుసరించి మౌనంగా ఇంటికి వెళ్లిపోయాను. నాన్నారు ఇంటికి రాగానే బొమ్మరిల్లులో సిద్ధార్థ్‌లా డవిలాగు చెప్దామనుకున్నా మనల్ని ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల ఆ ఎఫెక్ట్ రాలేదు. 'నాన్నా.. నేను ఆ జఫ్ఫా స్కూల్లో చదవను. కళలకి, కళాకారులకి గౌరవం లేనిచోట ఇంకొక్క ఏడాది కూడా చదివే ఓపిక నాకు లేదు' అని నా ఆక్రోశాన్ని వెళ్లగక్కాను. వెంటనే నాన్నారు 'ఆ జఫ్ఫా స్కూల్లో చదవనంటే ఇప్పటికిప్పుడు ఈ జఫ్ఫాగాడ్ని చేర్చుకునే ఇంకో స్కూల్ ఎక్కడ దొరుకుతుంది?' అని అమ్మోరితో తన బాధను వెళ్లగక్కారు. అయినా నా బాధ భరించలేక మరో జఫ్ఫా స్కూల్‌లో పట్టుకెళ్లి పడేశారు.

తరవాత...

ఇక్కడ రాంగోపాల్‌వర్మ ఫ్యాన్స్ బాబూ. ఒక్క సినిమాకి రెండు టికెట్‌లు తీయించే రకం మేము. దీని సీక్వెల్ కోసం కళ్లు, ముక్కూ, నోరూ కాయలు కాసేలా ఎదురుచూడండి.

Tuesday, January 3, 2012

సీక్రెట్ శాంటా.. నా జాతకానికి నిదర్శనం


ఈమధ్య మా ఆఫీస్‌లో హెచ్ఆర్ వాళ్లకి పిచ్చి పీక్స్‌కెళ్లిపోయింది. వారానికోరోజు  ఏదో ఒక డే పెట్టి జనాల్ని చంపుకుతింటున్నారు. ఒకరోజు ట్రెండీ డే, ఇంకోరోజు మాస్క్ డే, ఆ మర్నాడు ఫైర్‌డే, అటుమర్నాడు వాళ్ల పిండాకూడు డే.. ఇలా డేల మీద డేలు చేసి, డే అండ్ నైట్ అలిసిపోయి వాళ్ల దరిద్రగొట్టు డేల మీద వాళ్లకే చికాకేసింది. దాంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చెయ్యాలా అని అప్పుడెప్పుడో సునామీలో కొట్టుకుపోగా మిగిలిన కొద్దిపాటి మెదడు అవశేషాల్ని మథించడం మొదలెట్టారు.

సివరాకరికి తమదే అని చెప్పుకుంటూ ఎక్కడో ఎత్తుకొచ్చిన ఒక అవిడియాతో ముందుకొచ్చారు. ఒకానొకరోజు ఒక కొబ్బరిచిప్ప మొహం గాడు ఓ సంచిలో చీటీలు వేసుకుని వచ్చి నా ముందు నిలబడ్డాడు. ఏంది కత అని కొచ్చెనింగు చేస్తే, అందులోంచి ఒక చీటీ తియ్యమని మూగసైగలు చేశాడు. ఎందుకు అని ఆడిగా. అందులోంచి ఎవరి పేరొస్తే వాళ్లతో కలిసి డాన్స్ చెయ్యాలి.. ఆడైనా, మగయినా అన్నాడు. ఆడైనా? మగయినానా? మనకే డాన్సే రాదు. అందులో మళ్లీ మగవెధవలతో డాన్సులేంటి అసహ్యంగా? కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, తీస్తే అమ్మాయి పేరున్న చీటీయే తియ్యాలి అని ఫిక్సయ్యి బాగా కలిపి ఒక నిగనిగలాడే చీటీ తీసి విప్పి చూశా..

నోఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ.... మగపురుగు



ఆ రోజు సిక్‌లీవ్ గ్యారంటీ అనుకున్నా. ఇంతలో మా డామేజర్ లేచి కెవ్వుమని కేకెట్టాడు. ఏమైందో అని చూస్తే మీరు తీసిన చీటీల్లో ఉన్నవాళ్లని ఏదో ఒక గిఫ్ట్ తీసుకురావాలి. అది మీరు తెచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు. దీని పేరు సీక్రెట్ శాంటా అన్నాడు. నీ బొంద అని అనుకుని కొబ్బరిచిప్పగాడి వైపు చూశాను. జోకానులే అన్నట్టు పళ్లికిలించుకుంటూ నవ్వాడు. ఆడి మొహం చూసే ఓపిక లేక, ఇది ఎలా తప్పించుకుందామా అని ఆలోచించడం మొదలెట్టాను(బేసిక్‌గా ఎవడిదగ్గరైనా తీస్కోవడమే తప్ప ఇచ్చే అలవాటు లేదు మనకి).



ఇంతలో మా టీమ్‌లీడర్ నావైపు చూసి పట్టుకురాకపోతే నీకుంది చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చాడు. మనకి ఇలాంటివి ఎగ్గడంలో మంచి రికార్డు ఉంది. దాంతో మా లీడ్ నన్ను గుర్తుపెట్టేసుకున్నాడు. తప్పదురా బాబూ అనుకుని, ఒక గిఫ్ట్ కొని తెచ్చి పడేశాను. ఈ గేమ్‌లో ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎవడు ఎవడికి గిఫ్ట్ ఇచ్చాడో, ఏమి ఇచ్చాడో ఇచ్చేవాడికి తప్ప తీసుకునేవాడికి తెలీదు. దాని మీద ఇచ్చేవాడి పేరుండదు. అందువల్ల ఎంత చెత్త, కక్కుర్తి గిఫ్ట్ ఇచ్చినా ఎవరికీ తెలీదు. అయినా సరే.. కొత్త సంవత్సరం రోజు వాడ్ని ఏడిపించడమెందుకులే అని మంచి గిఫ్టే కొనిచ్చాను. మనకి కూడా ఎవడో ఒకడు ఏదో ఒకటి ఇస్తాడుగా కవర్ అయిపోతుందిలే అనుకున్నా.

ఇంతలో ఈ గిఫ్ట్‌ల పంపిణీ కార్యక్రమం మొదలెట్టారు. ఒక్కొక్కరి పేరు పిలుస్తుంటే నా పేరే పిలిచినట్టు అనిపించి లేవడం.. మనది కాదని తెలిసి కూర్చోవడం.. ఇలా నాలుగు సార్లు ఎక్సర్‌సైజ్ చేశాక నూటయాభైమందికి గిఫ్ట్‌లు పంచేశారు. మిగతావాళ్ల గిఫ్ట్‌లింకా రాలేదు రేపు మళ్ళీ ఈ రచ్చబండ కార్యక్రమం కొనసాగిస్తామని వాగ్ధానం చేశారు. సర్లే.. ఇవాళ కాకపోతే రేపైనా రాకతప్పదుగా. ఎవడొ మనకోసం షాపింగ్‌మాల్స్ అన్నీ తిరిగి సిద్ధం చేస్తున్నట్టున్నాడు. ఆమాత్రం టైం తీస్కోనీ అనుకున్నా..

మర్నాడు మళ్లీ మొదలెట్టారు. గిఫ్ట్ కాదు కదా దాని మీద కట్టే రిబ్బన్ కూడా రాలేదు. మూడో రోజు వెళ్ళిపోయింది. జనవరి ఒకటో తారీఖు వచ్చేసింది. గిఫ్ట్ లేదు.. గాడిదగుడ్డు లేదు.. ఒకటి, రెండు వెళ్లిపోయి మూడొచ్చేసింది. కానీ గిఫ్ట్ మాత్రం రాలేదు. ఇక ఉండబట్టలేక మా లీడ్‌ని అడిగాను. బాబూ ఇంకా గిఫ్ట్‌లేమన్నా మిగిలాయా? అన్నీ ఊడ్చేశారా? అని. ఇంకేం మిగల్లేదు నాయనా. ఈ పంపిణీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం అన్నాడు. ఓ నలుగురికి మినహా అందరికీ గిఫ్ట్‌లొచ్చాయి. అందులో ముగ్గురు వారం నుంచీ లీవ్‌లో ఉన్నారు. మిగిలింది నువ్వు..అని చిరునవ్వు విసిరాడు.

మరి నా సంగతేంది..?? అని అడిగాను. 'బిస్కట్' అని తలకాయ అడ్డంగా తిప్పాడు. బిస్కట్ లేదు, చాక్లెట్ లేదు నా గిఫ్ట్ నాక్కావాలీఈఈఈఈఈఈఈఈఈఈ.. అని గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుంటే అరిచెయ్యి ఆకాశం వైపు చూపించాడు. విషయం అర్థమయ్యి సైరన్ ఆపేసి వచ్చి కూర్చున్నాను. ఇంతలో ఒక అదృశ్యహస్తం వెనకనుంచి గోకింది. తిరిగిచూస్తే నా చేత గిఫ్ట్ తీసుకోబడ్డ మొట్టమొదటి వ్యక్తిగా చరిత్రకెక్కిన చేగోడీ మొహంగాడు. నాకెవడో ఇది గిఫ్ట్‌గా ఇచ్చాడు బాగుందా? అని నోరెళ్లబెట్టుకుని అడిగాడు. ఇప్పుడే వస్తా అని లేచి రెస్ట్‌రూంలోకి వచ్చాను.

నిర్మానుష్యంగా ఉన్న రెస్ట్‌రూంలో నేను, నాలుగు కుళాయిలు, రెండు అద్దాలు, ఒక చెత్తబుట్ట.. తల పైకెత్తి ఎదురుగా ఉన్న అద్దంలోకి చూశాను. అద్దంలో సుందర సుమనోహర దివ్య స్వరూపం...



               "థూ.. నీ  @$%్%%$^%*్$$%%్!"



Sunday, November 27, 2011

మర్చిపోలేము.. మండే గాయాన్ని

                మూడేళ్లయింది.. మనం మర్చిపోయాం. మూడేళ్ళు కరిగిపోయాయి.. ప్రభుత్వం గాలికొదిలేసింది. మూడేళ్ళు గడచిపోయాయి.. నేరం చేసినవాళ్ళు మరో ఘాతుకానికి గీతలు గీస్తున్నారు. చూసినవాళ్ళు మర్చిపోవచ్చు, అయ్యో పాపం అని నిట్టూర్చినవాళ్ళు మర్చిపోవచ్చు, ఓదార్చినవాళ్లు మరవొచ్చు గాక.. కానీ దెబ్బ తగిలినవాళ్లు మర్చిపోలేరు. ఆ దెబ్బకి కకావికలమైన తమ జీవితాలు మరువనివ్వవు. తల్లిదండ్రుల కోసం పిల్లలు ఏడ్చే ఏడుపులు మరువనివ్వవు. పిల్లల కోసం తల్లిదండ్రులు దిగమింగే కన్నీళ్ళు మరువనివ్వవు. అన్నిటినీమించి ఏడాదికోసారి మర్చిపోలేము మర్చిపోలేము అంటూ నాయకులు, సినిమా తారలు, నాలా పనీపాటా లేని వాళ్ళు రాసే సంతాపసందేశాలు అస్సలు మరువనివ్వవు. ముంబైలో కొందరు ఉన్మాదులు ఆడుకున్న ఆటకి కొన్ని వందల కుటుంబాలు ఛిద్రమైపోయి మూడేళ్ళు గడిచింది.
                         నేను మరణదండనకి వ్యతిరేకం. ఎంతటి దారుణ నేరాలు చేసినా మెజారిటీ ప్రజల కోపం తీర్చుకోవడం కోసం ఒక మనిషిని చంపే హక్కు వ్యక్తులకి గానీ, వ్యవస్థకి గానీ లేదని నేను బలంగా నమ్ముతాను. ఉరిశిక్ష అనే మాట వినిపించినప్పుడల్లా అది తప్పని వాదించేవాడిని. నవంబర్ 26, 2008 న ముంబై నగరం మీద జరిగిన దాడిలో అజ్మల్ కసబ్ అనే ఒకే ఒక్క తీవ్రవాది ప్రాణాలతో దొరికాడు. అతనికి పట్టుమని ఇరవయ్యేళ్ళు ఉంటాయి. జిహాద్ అనే మాటకి అర్థం కూడా తెలీదని పోలీసుల విచారణలో ఒప్పుకున్నవాడు. పాకిస్తాన్‌లోని ఓ మారుమూల పల్లెటూళ్ళో పుట్టినవాడు, చదువుసంధ్యలు లేనివాడు, పూటకి గడవక చిల్లర దొంగతనాలు చేసుకునేవాడు.. ఏ ధైర్యంతో పక్కనున్న పెద్దదేశం మీద యుద్ధానికి వచ్చాడు? ఏ ధైర్యంతో తుపాకి పట్టుకుని ముంబై నగరంలో అడుగుపెట్టాడు? అతను చేసిన నేరం తప్ప దాని వెనకున్న కారణం ఎవరికీ తెలీదు. ఆకలి.. పేదరికం.. డబ్బు.. ముంబైలో వందలమందిని అకారణంగా చంపేసినవాడికి ఇంత కన్నా పెద్ద కారణాలు లేవు మరి. కేవలం పది లక్షల రూపాయల డబ్బు కోసం ఈ దేశచరిత్రకి చెరగని రక్తపుమరకలంటించాడు. నా స్నేహితులు చాలామంది అతన్ని తక్షణమే ఉరితీసేయ్యాలని వాదించేవారు. వాడికి బ్రతికే అర్హత లేదంటూ గొంతుచించుకునేవారు. నేను ఒకటే ప్రశ్నించేవాడిని.. 'అతనికి బ్రతికే అర్హత లేదని నిర్ధారించడానికి నువ్వెవరు? నువ్వేమన్నా దేవుడివా? ఇరవైయేళ్ళ వయసులో అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి తనని తాను నెట్టుకోవడానికి గల నేపథ్యం ఏంటో నీకు తెలుసా? నువ్వు కూడా అదే పరిస్థితుల్లో ఉంటే డబ్బు కోసం అలాంటి పని చెయ్యవని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలవా? అప్పుడు నీ బ్రతికే అర్హతని మరొకరు నిర్ధారిస్తే నువ్వు క్షమిస్తావా?......??'... 
                             ఇప్పుడో వాస్తవగాథ.. తన బిడ్డ రోజూ బయటికి వెళ్ళే ముందు తన నుదుటి మీద చెయ్యి పెట్టి వీడ్కోలు చెప్పి వెళ్ళేవాడట. ఆరోజు ట్రిడెంట్ ఒబెరాయ్ హోటల్లో డిన్నర్‌కి వెళ్ళే ముందు కూడా అలాగే ఆప్యాయంగా వీడ్కోలు పలికాడు. పక్కనే కోడలు కూడా ఉంది. అదే చివరి వీడ్కోలని తెలిస్తే బహుశా ఆ తల్లి కొడుకు చేతిని వదిలేది కాదేమో. మూడేళ్ళు గడిచిపోయినా ఇప్పటికీ ఆ తల్లి కంటినిండా నిద్రపోదు. తన కొడుకు ఫోటో ముందు పెట్టిన దీపం ఎప్పటికీ ఆరిపోకూడదని ప్రతీ రెండు గంటలకోసారి లేచిచూస్తుందట. డెబ్భైయేళ్ల వయసులో ఆ తల్లిదండ్రుల పడే వేదన నరకం అంటే భూమ్మీదే ఉంటుందని గుర్తుచేస్తుంది. అన్నిటికన్నా దుర్భరమైంది ఏంటంటే తల్లిదండ్రులు చనిపోయారనే ఊహ కూడా లేని తమ మనవరాళ్ళ ముందు లేని నవ్వుని ముఖం మీద వేసుకుతిరగడం. కనీసం మాకు ఏడ్చే అదృష్టం కూడా లేదంటూ ఆ తండ్రి తన గద్గద స్వరంతో చెప్పే మాట వింటే కళ్ళలో కన్నీటిసుడులు తిరగనివాడు మనిషేకాడు. 
                              ఇలాంటిదే మరో కథ.. ఒక హీరోది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అధికారి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.. నిజమైన హీరో. ఆరోజు తాజ్ హోటల్లో ఆరుగురు సభ్యుల తన బృందంతో కలిసి తీవ్రవాదులని మట్టుబెట్టడానికి వెళ్ళారు. గాయపడిన తన సహచరులను కాపాడడం కోసం వారందరిని కిందికి పంపేసి, తీవ్రవాదులతో తానొక్కడే పోరాడారు. ఆ వీరోచిత పోరాటంలో ఆ హీరో వీరస్వర్గాన్ని అలంకరించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ రూపంలో దేశానికి ఒక హీరో దొరికాడు.. ఓ కుటుంబానికి మాత్రం తమ ఆశాజ్యోతి దూరమయ్యాడు. ఇంతటి త్యాగానికి పాల్పడిన ఆయన్ని, ఆయన కుటుంబాన్ని ఈ దేశ ప్రభుత్వం 'గౌరవించిన' తీరు చూస్తే మనం సిగ్గుతో ఉరేసుకుచావాలి. కానీ ఇప్పటికీ ఆ కుటుంబం ఈ దేశం నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించడం లేదు. ఈ దేశానికి తాము ఓ వీరుడ్ని ప్రసాదించామని గర్వపడుతున్నారు. తమ బిడ్డ మరణించాడంటే ఆ తల్లిదండ్రులు అంగీకరించారు. ఇప్పటికీ వారి సెల్‌ఫోన్‌లో సందీప్ ఫోన్ నంబర్ అలాగే ఉంది. తమ బిడ్డ ఏదో ఒకనాడు ఫోన్ చేస్తాడంటూ ఆ తల్లి ఎదురుచూస్తూనే ఉంది. 
                                    ఇక నాకు కనువిప్పు.. ఫాతిమా అనే ఒక గృహిణి. ముంబైలోని ఒక మురికివాడలో ఉండే ఫాతిమాకి ఒక కూతురు, ఒక కొడుకు. ఆ రోజు ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో రైలు కోసం ఎదురు చూస్తుంటే భయంకరమైన శబ్దాలు వినిపించాయి. అరుపులు.. కేకలు.. గందరగోళం.. ఇంతలో తన పక్కనుంచి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. 'అమ్మా' అంటూ పెద్ద కేక వినిపించింది. ఆ గొంతు తన కూతురిదే. తిరిగి చూడబోయింది. కానీ ఆ గందరగోళంలో తన కూతురు ఎక్కడుందో కనిపించలేదు. అప్పుడే కాదు.. ఇంకెప్పుడూ కనిపించలేదు. ఇప్పటికీ కూతురు ఏమయ్యిందో ఆ తల్లికి తెలీదు. కనీసం కూతురు బ్రతికుందో, లేదో కూడా తెలియని పరిస్థితి ఏ తల్లికీ రాకూడదు. మరి కసబ్‌ని ఉరితీస్తారట.. దీనికి మీరేమంటారు అంటే ఫాతిమా చెప్పిన సమాధానం. "వాడు ఎంతోమందిని చంపేశాడు. అందులో ఆడవాళ్ళు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు, ఆఖరికి ప్రతిఘటించలేని వికలాంగులు కూడా ఉన్నారు. వీళ్లెవరి మీద వాడు చూపించని జాలి వాడి మీద మనమెందుకు చూపించాలి?
                                ఆ సమాధానం నాకే చెప్పింది. నాకు తన బాధ అర్థం కావాలన్నట్టు చెప్పింది. బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, తల్లిదండ్రులని కోల్పోయిన బిడ్డలు, స్నేహితుల్ని దూరం చేసుకున్నవారు, ప్రేమించినవాళ్లను కోల్పోయినవాళ్ళు... వీళ్ళందరి బాధని అర్థం చేసుకోమని చెప్పిన సమాధానం. నిజమే.. వాళ్ళు మనమీద చూపని కారుణ్యం, మనం వాళ్ళ మీద ఎందుకు చూపాలి? అయితే కసబ్ అనే బలిపశువుని చంపేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? పొరుగుదేశంలో కూర్చుని ఇదంతా నడిపించిన వాళ్ళని మాత్రం ఏమీ చెయ్యలేమా? ఏమో.. మన ప్రభుత్వాలు, నాయకుల చేతకానితనం వల్ల నిజంగానే వాళ్ళని ఏమీ చేయ్యలేమేమో. అందుకే ఆ తీవ్రవాదులకే ఒక విజ్ఞప్తి.. "అయ్యా.. మేము మిమ్మల్ని ఏమీ చెయ్యలేకపోవచ్చు. మీరు మాకన్నా శక్తివంతులు కావచ్చు. మమ్మల్ని చంపడానికి మరో వెయ్యిమందిని పంపొచ్చు. కానీ అలా పంపే ముందు బుల్లెట్ తగిలినవాడి బాధ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. వాడి కుటుంబం ఎంత తల్లడిల్లిపోతుందో ఊహించండి. రేపో, మాపో మీ కసబ్‌ని మా దేశంలో ఉరితీసేస్తారుగా. ఆరోజు వీలైతే అతని ఇంటికి వెళ్లి అతని తల్లి పడే బాధని చూడండి. మానవత్వం ఉంటే ఆ బాధని మీరు కూడా పంచుకోండి. ఆ తరవాత కూడా మీకు మమ్మల్ని చంపాలనిపిస్తే, మా ప్రాణాలు ఎప్పుడూ గాల్లో దీపాలే. మా నాయకులు మమ్మల్ని ఎలాగూ పట్టించుకోరు. రండి..మేం సిద్ధంగా ఉన్నాం."


Tuesday, August 2, 2011

ఆధిపత్యపోరులో ఆంధ్రా మర్డోక్స్

                          మీడియా గురించి ఏమాత్రం పరిచయం ఉన్నవారికైనా రూపర్ట్ మర్దోక్ గురించి పరిచయం అనవసరం. గ్లోబల్ మీడియాని మకుటం లేని మహారాజులా ఏలాడు మర్దోక్. ఏలుతున్నాడు. ఏలుతూ ఉంటాడో లేదో తెలీదు. గతనెల బ్రిటన్‌ను ఒక కుదుపు కుదిపిన హ్యాకింగ్ స్కాండల్‌లో మర్దోక్ పీకల్లోతు కూరుకుపోయాడు. అయితే వివాదాలు, ఆరోపణలు మర్డోక్‌కి కొత్తకాకపోయినా, గతంలోలా ఈసారి తనని కాపుకాయడానికి రాజకీయనాయకులు సాహసించకపోవడం మర్డోక్‌కు సమస్యగా మారింది. అసలు నాయకులే ముందు తమను తాము మర్దోక్ నుంచి దూరం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు మర్దోక్ ప్రాభవం కొనసాగుతున్నంత కాలం ఆయన పరిచయభాగ్యం కోసమే పరితపించిపోయిన నాయకులు ఇప్పుడు మర్దోక్ మాటెత్తితే మండిపడిపోతున్నారు. అసలు తమకు, రూపర్ట్ మర్డోక్‌కు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకోవడానికే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా చూశాక నాకు ఒకటి స్పష్టంగా అర్థం అవుతోంది. దేశాలు మారొచ్చు, ప్రజలు మారొచ్చు, భాషలు మారొచ్చు, సంస్కృతులు మారొచ్చు. కానీ ప్రపంచంలో ఏమూలకి వెళ్ళినా రాజకీయ నాయకులందరూ ఒకలాగే ఉంటారు. అది భారతదేశం అయినా, బంగ్లాదేశ్ అయినా, బ్రిటన్ అయినా నాయకులు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు, ఎంతకైనా దిగజారతారు.
                              అసలు రూపర్ట్ మర్డోక్‌కి ఇంత మితిమీరిన స్వేచ్చ, పలుకుబడి, బయటకి కనబడని అధికారాలు ఎలా దఖలుపడ్డాయి? ఈ ప్రశ్న దగ్గరే మనకొక తీగ దొరుకుతుంది. ఆ తీగ లాగితే లాగడానికి మన శక్తి సరిపోనంత పెద్ద డొంక కదులుతుంది. అంతా మన వల్ల కాదు గానీ ఆ డొంకని లండన్ నుంచి మొదలెట్టి ఢిల్లీ మీదుగా హైదరాబాద్ వరకు లాగి వదిలేద్దాం. మొదట మర్డోక్‌తో మొదలెడితే ఈ ఆస్ట్రేలియన్ అమెరికన్ 1953లో తన తండ్రి సర్ కీత్ మర్దోక్ నుంచి వారసత్వంగా వచ్చిన న్యూస్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా మొదలెట్టిన అప్రతిహత జైత్రయాత్రని తాజా హ్యాకింగ్ స్కాండల్ వరకు కొనసాగించాడు. మర్దోక్ బిజినెస్ స్ట్రాటజీ అద్భుతంగా ఉంటుంది. నష్టాల్లో ఉన్నవి, రేపోమాపో మూసెయ్యాలి అనుకున్న మీడియా సంస్థల్ని కొనుగోలు చెయ్యడం, వాటి ద్వారా కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం, కొత్తకొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టి, పత్రికల్ని డైనమిక్‌గా తీర్చిదిద్దడం, చివరికి ఎంటర్ అయిన ప్రతీ మార్కెట్‌లోనూ ఆనతికాలంలోనే నెం.1 స్థానానికి చేరుకోవడం. తనకి పోటీ ఇచ్చే న్యూస్‌పేపర్లను కూడా కొనిపడెయ్యడం మర్దోక్ ప్రత్యేకత. ఇక జర్నలిజంలో డైనమిజం పేరుతో ఈరోజు మనం చూస్తున్న వాణిజ్య ధోరణిని ప్రవేశపెట్టింది కూడా రూపర్ట్ మర్దోకే. వార్తని కూడా ఒక వ్యాపారవస్తువుగా చూడాలని నమ్మి, ఆచరించి, ఆ వస్తువుని అమ్ముకుని బిలియన్ డాలర్ల సంపదని గడించినవాడు రూపర్ట్ మర్దోక్. వస్తువు అమ్ముడుపోయింది అంటే కొనేవాడున్నాడన్నమాట. కొనేవాడున్నాడంటే వ్యాపారం మంచిదే. కాబట్టి మర్దోక్ వార్తలతో వ్యాపారం చేసుకోవడంలో తప్పులేదు. మర్దోక్ వ్యాపారంతో ఆగిపోయుంటే అసలు సమస్యే లేదు. కానీ డబ్బు రుచి మరిగినవాడు తరవాత కోరుకునే రుచి అధికారం. అందులోనూ విస్తృతంగా ప్రజలను ప్రభావితం చేయగల మాధ్యమాలు చేతిలో ఉన్నప్పుడు ఆ అధికార దాహం మరింతగా ఉంటుంది. ఇదే మర్డోక్‌ను అధికారసౌధాలవైపు ఆశగా చూసేలా చేసింది. తన స్వదేశం ఆస్ట్రేలియా రాజకీయాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయి నుంచి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరాక్ ఒబామాకు ఎలక్షన్ ఫండ్ సమకూర్చే స్థితికి వచ్చాడు. అయితే మర్దోక్ తన అధికార దాహాన్ని సంపూర్ణంగా తీర్చుకున్నది మాత్రం బ్రిటన్‌లోనే. బ్రిటన్‌లో అత్యధిక సర్క్యులేషన్ గల న్యూస్‌పేపర్లు,టీవీచానళ్ళు తన చేతిలో ఉండడంతో అక్కడి ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేసేవాడు. ఈ తంతు మార్గరెట్ థాచర్ బ్రిటన్ ప్రధానిగా ఉండగా మొదలైంది. మార్గరెట్ థాచర్ పాలనా కాలంలో ఆమెకి అనుకూలంగా వార్తలు రాసిన మర్దోక్ మీడియా 1992 ఎన్నికల్లో ఉన్నట్టుండి జాన్ మేజర్ వైపు తిరిగిపోవడంతో ఆ ఎన్నికల్లో మేజర్ అనూహ్య విజయం సాధించాడు. ఆ తరవాత జరిగిన ఎన్నికల్లో మర్దోక్ మీడియా లేబర్ పార్టీకి చెందిన టోనీబ్లెయిర్‌ని వెనకేసుకురావడంతో బ్లెయిర్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యాడు. గత ఎన్నికల్లో మళ్ళీ ప్లేటు మార్చేసి టోరీ పార్టీని, డేవిడ్ కామెరాన్‌ను సమర్థించడంతో కామెరాన్ గెలిచాడు. అయితే ఎన్నికల్లో గెలిచే అవకాసం ఉన్నవాళ్ళనే మర్దోక్ సమర్థిస్తాడంతూ విమర్శకులు అన్నా మర్దోక్ ఎవరికీ మద్దతిస్తే వాళ్ళే గెలుస్తారని బ్రిటన్ రాజకీయనేతల బలమైన నమ్మకం. అందుకే వీలైనప్పుడల్లా మర్దోక్ ప్రసన్నం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసేవారు. అయితే ఈ చదరంగంలో అంతిమంగా లాభపడేది ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటాను. మర్దోక్ ఒత్తిడితో బ్లెయిర్ నాయకత్వంలోని లేబర్ పార్టీ తన సిద్ధాంతాలనే పూర్తిగా మార్చేసుకోవడం ఇందుకు ఒక చిన్న ఉదాహరణ.
                              రూపర్ట్ మర్దోక్ మంచివాడా, చెడ్డవాడా అనే విషయం పక్కనపెడితే అతనొక రోల్‌మోడల్. అవును..బయటికి చెప్పుకోకపోయినా మీడియా సంస్థలను నడిపే, నడపాలనుకునే ప్రతి ఒక్కరికీ మర్దోక్ ఒక తిరుగులేని రోల్‌మోడల్. ప్రపంచంలోని ప్రతీ మీడియా సంస్థ మీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మర్దోకిజం ప్రభావం ఎంతోకొంత ఉండితీరుతుంది. మన దేశంలోనే చూడండి. కేవలం వార్తలకి, కుంభకోణాలు బయటపెట్టడానికి మాత్రమే పరితమవ్వాల్సిన మీడియా పాలనా వ్యవహారాల్లో తలదూర్చేదాకా వచ్చాయి. గతేడాది ఢిల్లీని ఓ కుదుపు కుదిపిన నీరారాడియా టేపుల్లో రెండు గొంతులు ప్రధానంగా వినిపించాయి. ఎన్‌డీటీవీ గ్రూప్ ఎడిటర్ బర్ఖాదత్, హిందుస్థాన్‌టైమ్స్ ఎడిటోరియల్ డైరెక్టర్ వీర్‌సంఘ్వీ పోర్ట్‌ఫోలియో కేటాయింపుల లాబీయింగ్‌లో నీరారాడియా గారికి చేతనైనంత సాయం చేసి పెట్టారు. వీరిద్దరే కాదు ప్రభుచావ్లా, రాజ్‌దీప్‌సర్దేశాయ్, శంకర్అయ్యర్, ఎంకె వేణు, జహంగీర్ పోచా లాంటి తలపండిపోయిన జర్నలిస్టులందరూ ఇందులో దొరికిపోయారు. కానీ ఒక విషయం గమనించారా? బ్రిటన్‌లో ఒక పదమూడేళ్ళ అమ్మాయి సెల్‌ఫోన్ హ్యాక్ చేసినందుకు రూపర్ట్ మర్దోక్ అంతటివాణ్ణి లాక్కొచ్చి పార్లమెంట్ ముందు కూర్చోబెట్టారు. మన దేశంలో జరిగింది నిజానికి అంతకన్నా పెద్ద కుంభకోణం. కానీ ఇప్పటికీ బర్ఖాదత్ వియ్ ద పీపుల్, ద బాక్ స్టాప్స్ హియర్ అంటూ ప్రజాసమస్యల గురించి చర్చా కార్యక్రమాలు చేసుకుంటోంది. వీర్‌సంఘ్వీ కస్టమ్‌మేడ్ అంటూ ఊళ్లు పట్టుకు తిరుగుతున్నాడు. ఈ దేశంలో ఎవ్వడికీ శిక్ష పడదు, బలహీనులకి తప్ప.
                                 ఇంక డొంకని ఆంధ్రప్రదేశ్‌కి లాక్కొద్దాం. 'ఆంధ్రా మర్దోక్' అనే బిరుదివ్వాలంటే దానికి ఒక్క రామోజీరావు గారే అర్హులని బలంగా నమ్మేవాడ్ని ఒకప్పుడు. ఎందుకంటే కొన్నేళ్ళ క్రితం వరకు తెలుగు మీడియా అంటే ఈనాడు, ఈనాడు అంటే రామోజీరావ్ గారు. నిజంగా ఆయన మర్డోక్‌ని ఆదర్శంగా తీసుకున్నారో, లేదో తెలీదు గానీ పాశ్చాత్య దేశాల్లో మర్డోక్‌కి ఉన్నంత చరిత్ర ఆంధ్ర దేశంలో రామోజీరావ్ గారికీ ఉంది. స్వతహాగా కమ్యూనిస్ట్ భావాలు కలిగిన పెట్టుబడిదారుడు రామోజీరావ్ గారు. చూశారా.. ఒక మనిషిలో ఎంత వైవిధ్యమైన సిద్ధాంతాల కలయికో. కాంగ్రెస్ అంటే కిట్టని రామోజీరావ్ గారికి ఎన్‌టీఆర్ రూపంలో ఒక ఆయుధం దొరికింది. ఎన్‌టీఆర్‌ను రాజకీయాల్లోకి లాగి, ప్రోత్సహించడమే కాకుండా ఆయన్ని ముఖమంత్రిని చేసే బాధ్యతను కూడా రామోజీరావ్ గారే నెత్తిన వేసుకున్నారు. ఎన్‌టీఆర్‌ అఖండవిజయంతో ఎన్‌టీఆర్‌కి, రామోజీరావ్ గారికి బాగా పొత్తుకుదిరింది. అన్నగారు అర్జెంటుగా పైకెళ్ళిపోయినా ఆరోజు నుంచి ఈరోజు దాకా తెలుగుదేశం పార్టీకి కాపుకాసే బాధ్యతని మాత్రం ఈనాడు మర్చిపోలేదు. అన్నట్టు తెలుగు పత్రికా రంగంలో సంచలన మార్పులకి తెరతీసిన రామోజీరావ్ గారే తెలుగులో ఇరవైనాలుగు గంటల వార్తాప్రసారాలకి కూడా తెరతీశారు. అక్కడ కూడా తనకి ఎదురులేదని ఆయన సంతోషపడిపోయేలోపు మరో మర్దోక్ బయలుదేరాడు. ఆయనే రవిప్రకాష్. జనం టీవీ9 రవిప్రకాష్ అంటూ ముద్దుగా పిలుచుకునే ఈయన తెలుగు మీడియాని ఒక ఊపు ఊపి వదిలిపెట్టాడు. టీవీ9 కొద్దికాలంలోనే శిఖరాగ్రాలకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. స్టింగ్ ఆపరేషన్లని పరిచయం చేసి ప్రభుత్వోద్యోగుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాడు. ఇన్ని ఛానళ్ళు వచ్చినా, విపరీతమైన పోటీని ఎదుర్కొంటున్నా ఇప్పటికీ టీవీ9 అగ్రస్థానంలో కొనసాగుతోందంటే అప్పుడు పడ్డ పునాదే కారణం. ఇంక తరవాత జరిగిన చరిత్ర అంతా మీకు తెలిసిందే. ఆ తర్వాత కుప్పలుతెప్పలుగా ఛానళ్ళు వచ్చిపడ్డాయి. ఏపార్టీకి ఆపార్టీ ఛానళ్ళు వచ్చేశాయి. ప్రతిఒక్కరూ మరో మర్దోక్ అయిపోదామనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మధ్య ఇంకో మర్దోక్ బయలుదేరాడు. ఆయన పేరు వేమూరి రాధాకృష్ణ. అసలు రూపర్ట్ మర్దోక్ కూడా ఈయన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ముందు దొరికిన క్లూని పట్టుకుని ఒక గంట ప్రోగ్రాం తయారుచేసేసి, అది టెలికాస్ట్ అయిపోయిన తర్వాత అందులో నిజానిజాలెంత అని ఆరాతీయడం మొదలెడతారు. అది ఆయన స్టైల్. ఆయన స్పీడ్‌కి తగ్గట్టే ఆయన ప్రసారం చేసిన కొన్ని కథనాలు సక్సెస్ అవ్వడంతో ఆయనకీ స్పీడుకి బ్రేకులు లేకుండా పోతున్నాయి. ముఖ్యంగా గవర్నర్‌ని పదవిలోంచి పీకించెయ్యడం, విజయవాడ కమీషనర్ సీతారామాంజనేయులని ట్రాన్స్‌ఫర్ చేయించడం లాంటి వాటితో ఆయనకీ, ఆయన ఛానల్‌కీ పట్టపగ్గాలు లేకుండాపోతున్నాయి.
                                అసలు ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవడానికి ఇష్టపడని రామోజీరావ్ గారు న్యూస్‌చానల్ విషయంలో మాత్రం ఎందుకంత అగ్రెసివ్‌గా ముందుకెళ్లడం లేదనేది ఇప్పటికీ మీడియాలో చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. కానీ రామోజీరావ్ గారికి పోటీ అంటే ఇష్టం కాబట్టి ఆయన పోటీ నుంచి తప్పుకోరు. ఆ లెక్కన ప్రధానంగా ముగ్గురు మర్డోక్‌లు ఆధిపత్యం కోసం తీవ్రంగా పోరాడుతున్నారు. ఇంకా భవిష్యత్తులో పోటీకొస్తారో తెలీదు. సో.. 'ఆంధ్రా మర్దోక్' అనే బిరుదరాజం ఎవరికి అలంకారం అవుతుందో వేచి చూడాల్సిందే.

కెమెరామెన్ చాణక్యతో చాణక్య, టీవీ శరచ్చంద్రిక, హైదరాబాద్.. ; )